సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

వైభవంగా శాస్త్రోక్తంగా శ్రీ వరలక్ష్మీ వ్రతం

తిరుపతి,నేటి దిశ:  ఆగస్టు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు.

అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు.

భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాసన్ తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.

తరువాత 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.

భక్తులను విశేషంగా అకట్టుకున్న వ్రత మండపం

టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. 20 మంది సిబ్బంది, 2 ట‌న్నుల సంప్రదాయ పుష్పాలు, 20 వేల కట్ ఫ్లవర్స్ తో ఐదు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, వ్రత మండపాన్ని సుందరంగా అలంకరించారు.

ఇందులో తమలపాకులు, అపిల్‌, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్, మొక్కజొన్న, పైనాపిల్‌ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాత విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.

భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో 2, పుష్కరిణి వద్ద 1, గంగుండ్ర మండపం వద్ద 1 కలిపి 4 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

స్వర్ణరథోత్పవం

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు , జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం దంపతులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ మతి శ్రీవాణి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.