తిరుమల, 2023 సెప్టెంబరు 18: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు, అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ కొట్టు సత్యనారాయణ, శ్రీ ఆదిమూలపు సురేష్, శ్రీమతి రోజా, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ యానాదయ్య, ఎమ్మెల్సీలు శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీ భరత్, ఎమ్మెల్యేలు శ్రీ కొడాలి నాని, శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీ మేడా మల్లికార్జున రెడ్డి, శ్రీ మధుసూదన్ యాదవ్, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ డికె.బాలాజి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్, ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.